వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు పాలనపై ఉపాధ్యాయులు గర్జిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై శీత కన్నేసిన సర్కారు దురహంకార పూరిత విధానాలపై ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి రణభేరి3.0 పేరుతో దశలవారీ పోరాటం చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమర్ ప్రకటించారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. మనోహర్కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రణభేరి 2.0 పేరుతో ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో ధర్నా చేసినా, ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 24 నుంచి దశల వారీ పోరాటానికి సిద్ధపడుతున్నట్టు స్పష్టం చేశారు. మార్చి 24న నియోజక వర్గ కేంద్రాలలో, ఏప్రిల్ రెండు, మూడు తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర స్థాయిలో 15 నుంచి 19 వరకు ఐదు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని పేర్కొన్నారు. ఏప్రిల్ 28న చలో సెక్రటేరియేట్ నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య, జిల్లా కోశాధికారి కె.గంగ రాజు తదితరులు ప్రసంగించారు.


