● జిల్లా అధికారులుగా రాణిస్తున్న మహిళలు
● ప్రజలకు సేవలు అందించాలని తాపత్రయం
● తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్న వైనం
వన్టౌన్/గాంధీనగర్/లబ్బీపేట: కొవ్వొత్తిలా కరుగుతూ కుటుంబానికి వెలుగునిస్తోంది మహిళ. ఇల్లాలి చదువు ఇంటికే కాదు.. సమాజానికే వెలుగు అని చాటిచెబుతోంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లోనే కాదు అధికారిగానూ తనదైన ముద్రతో విజయ కేతనం ఎగురువేస్తోంది. గృహిణిగా ఇంటిని చక్క దిద్దుతున్న ఆమె అధికారిగా ఓర్పు, నేర్పుతో విధులు నిర్వర్తిస్తూ తాను అవనితో సమానమని నిరూపిస్తోంది. మహిళలు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సాధించలేనిది లేదు అనేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారులే నిదర్శనం. మహిళల చదువుకు ప్రాధాన్యత లేని రోజుల్లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత చదువులు చదివి నేడు జిల్లా ఉన్నతాధికారులుగా రాణిస్తున్నారు. మరి కొందరు ప్రజాప్రతినిధులు గానూ మన్ననలు అందుకుంటున్నారు. మహిళా లోకానికి వీరి కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకం. పలు ముఖ్య శాఖలను తమ ప్రతిభతో ప్రగతి పథాన నడుపుతున్నారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధికారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...


