డిజిటల్ విధానంలో జనగణన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జనగణన ఈ దఫా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. జనగణన విధులను అత్యంత నిబద్ధతతో, జవాబుదారీతనంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. కచ్చితమైన డేటా సేకరణ దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాదిగా నిలుస్తోందన్నారు. జనగణనలో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఆదివారం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో సెన్సస్ –2027కు సంబంధించిన తొలి దశ (హౌస్ లిస్టింగ్ – హౌసింగ్ సెన్సస్)పై శిక్షణ కార్యక్రమం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ (హైదరాబాద్) కార్యాలయ జాయింట్ డైరెక్టర్ జి. ప్రసన్న కుమార్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమం ద్వారా జనగణనపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించామన్నారు. ఇందులో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే అసలు విజయమని చెప్పారు.
రెండు దశల్లో..
జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని కలెక్టర్ వివరించారు. తొలి దశగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్ (పీఈ)లో జనాభా గణాంకాలు నమోదు చేస్తారని చెప్పారు. జనగణన ద్వారా లభించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు, వనరుల సమర్థ వినియోగానికి కీలకమని పేర్కొన్నారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, సీపీవో వై. శ్రీలత, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఎస్వోలు, డెప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.


