ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్, చైనా కీలకం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్, చైనా ప్రధాన శక్తులుగా ఎదుగుతున్నాయని, 21వ శతాబ్దం ఆసియాదేనని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారుడు డాక్టర్ సంజయబారు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సోమవారం కనకదుర్గాంబ అండ్ డాక్టర్ జంధ్యాల దక్షిణామూర్తి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్, విజయవాడ 13వ స్మారకోపన్యాసం ‘అభివృద్ధి చెందుతున్న ఆసియాలో అభివృద్ధి చెందుతున్న భారతదేశం‘ అనే అంశంపై జరిగింది. ముఖ్య అతిథి సంజయబారు మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ ఆర్థికవృద్ధి సుమారు ఏడు శాతం ఉందని, కానీ ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే అది 10 నుంచి 12 శాతం వరకు పెరగాలన్నారు. ఉత్పత్తి పెరిగితే ఉపాధి పెరుగుతుందని, పరిశ్రమలు, తయారీ రంగం అభివృద్ధి చెందితేనే పెద్ద స్థాయిలో ఉద్యోగాలు సృష్టించవచ్చన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జంధ్యాల శంకర్, ట్రస్టీలు డాక్టర్ సి.నాగేశ్వరరావు, కె.దుర్గాప్రసాద్(వెస్టిన్ కాలేజ్ డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారుడు డాక్టర్ సంజయబారు


