‘పెడల్ ఫర్ ఫ్రీడమ్’ సైకిల్ ర్యాలీ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘పెడల్ ఫర్ ఫ్రీడమ్’ ని చేపట్టినట్లు కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యాన 11 మంది విద్యార్థులు ఆరు రోజుల పాటు ఐదు జిల్లాల మీదుగా 600 కి.మీ ర్యాలీ చేయనున్నట్లు వివరించారు. స్థానిక మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్, ఈగల్ ఏపీ, రెడ్ రోప్ మూవ్మెంట్ ఆధ్వర్యాన పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఈగల్ ఏపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ రవికృష్ణ, ఈగల్ ఏపీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.నగేష్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ కె.భాగ్యలక్ష్మి, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వల్లూరు నీరజ హాజరయ్యారు.
విజయవాడ టు విశాఖ..
ఆయన మాట్లాడుతూ ఆరు రోజుల పాటు జరిగే పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ ర్యాలీ ద్వారా మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు, మానవ అక్రమ రవాణా, సురక్షిత వలసలపై అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, న్యాయ ప్రాప్తి, లైంగిక విద్య, ఎయిడ్స్పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర సాగుతుందని తెలిపారు. కళాశాల విద్య అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ తులసి మస్తానమ్మ, రెడ్ రోప్ కోఆర్డినేటర్ క్రిస్టోలెట్, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, ఐక్య కోఆర్డినేటర్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


