మరియమ్మ పండుగ.. దీవెనలు మెండుగ
వైభవంగా గుణదల తిరునాళ్ల ప్రారంభం
అమ్మా దర్శనం.. మరియ తల్లీ దర్శనమన్న భక్తుల శరుణుఘోషతో గుణదల కొండ మారుమోగింది. మరియమాతను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివస్తున్నారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయం దిగువన ఉన్న బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు తిలకిస్తూ యాత్రికులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. గుణదల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
గుణదల(విజయవాడ తూర్పు): మేరీమాత కొలువైన గుణదల కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మ దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దక్షిణ భారత దేశంలో ప్రముఖ క్రైస్తవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు బిషప్ గ్రాసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, సిల్వర్ జుబిలేరియన్ గురువులు నేలటూరి ఫ్రాన్సిస్, మద్దాల జోసఫ్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛన ప్రాయంగా ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులుగా విచ్చేసిన నేలటూరి ఫ్రాన్సిస్ భక్తులకు దైవ సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. శ్రీసభలో మరియ తల్లి సమైక్య మాతగా గుర్తింపు పొందింద న్నారు. మరియమాత సంపూర్ణ దైవత్వానికి కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. నేటి ప్రపంచంలో అనేక దేశాలు విభజన దిశగా అడుగులు వేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు మానవీయత సన్నగిల్లుతోందని అభిప్రాయపడ్డారు. సమస్త జనులను ఐక్య పరిచే శక్తి సృష్టికర్త అయిన దేవునికే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. తమ జీవితాలను, కుటుంబాలను కట్టుకోవా లని వివరించారు. అనంతరం విజయవాడ బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ.. గుణదలలో జరుగుతున్న 102వ మహోత్సవాలు దీవెనకరంగా జరగాలని కోరారు. పుణ్యక్షేత్రానికి చేరుకునే యాత్రికులకు మరియ తల్లి దీవెను మెండుగా లభిస్తాయని వివరించారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులతో కలసి సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు సత్ప్రసాదాన్ని అందించి యాత్రికుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సజావుగా ఉత్సవాలు
పుణ్యక్షేత్ర గురువులు, పోలీసులు, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో గుణదల ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయి. ఎక్కడా భక్తుల తొక్కిసలాటలు జరుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది తాగునీరు, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య శిబిరాలు వంటి వసతులు కల్పించారు. ఎప్పటికప్పుడు పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నింటినీ శుభ్రం చేస్తున్నారు.
సమష్టి దివ్యబలి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడప బిషప్ సగినాల పాల్ ప్రకాష్ మాట్లాడుతూ.. మరియమాత పవిత్రతను బట్టి దేవాది దేవుడే ఆమెను లోకమాతగా ఎంపిక చేశాడని చెప్పారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులు వరుస క్రమంలో దేవుని గీతాలను ఆలపిస్తూ జపమాల ధ్యానంతో వేదిక పైకి చేరుకున్నారు. మహోత్సవాలలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
మరియమ్మ పండుగ.. దీవెనలు మెండుగ
మరియమ్మ పండుగ.. దీవెనలు మెండుగ
మరియమ్మ పండుగ.. దీవెనలు మెండుగ
మరియమ్మ పండుగ.. దీవెనలు మెండుగ


