ప్రతి అర్జీని ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే ప్రతి అర్జీని ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, డీఆర్వో కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరిగాయి. జేసీ ఇలక్కియ, డీఆర్వో నరసింహాం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల న్నారు. మొత్తం 192 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో 54 రెవెన్యూ, ఇతర శాఖలకు చెందిన అర్జీలు 138 ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం తాడేపల్లి రెవెన్యూ పరిధిలో ఆర్ఎస్ నంబరు 39లో కోట్ల విలువ చేసే మట్టి అక్రమంగా తరలిస్తున్నారని టీడీపీ గ్రామ నాయకుడు ఎం.జమలయ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారని, రోజుకు సుమారు 500 లారీలకుపైగా మట్టి తరలిపోతోందని వివరించారు. జోగా ప్రవీణ్ అనే వ్యక్తి ఎన్ఓసీ తీసుకుని, దానిని అడ్డం పెట్టుకున్న అడ్డగోలుగా తవ్వేస్తున్నారని, అధికారులకు లారీలు అప్పగించినా నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు.


