జోగి రమేష్ ఇంటిపై దాడి అమానుష చర్య
మాజీ హోం మంత్రి తానేటి వనిత
ఇబ్రహీంపట్నం: జోగి రమేష్ ఇంటిపై దాడి అమానుష చర్య అని మాజీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, దాడులు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులను తానేటి వనిత సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక వారి ఇళ్ల పైన పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడులు చేయించడం ఆటవిక చర్య అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇళ్లు, కుటుంబ సభ్యులపై దాడి చేయడం, ఆస్తులు ధ్వంసం చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదన్నారు. దాడులు చేసే వారిని ఆపకుండా పోలీసులు వారికి సహకరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడమే అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ లేదని రిపోర్టు వచ్చినా దానికి సమాధానం చెప్పలేని చంద్రబాబు ప్రభుత్వ నాయకులు నిస్సిగ్గుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె వెంట గోపాలపురం జెడ్పీటీసీ కాకులపాటి శ్రీను, నల్లజర్ల, ద్వారకాతిరుమల ఎంపీపీలు బంకా అప్పారు, బొండాడ వెంకన్నబాబు, వివిధ మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. అలాగే అమలాపురం ఎస్ఈసీ సభ్యుడు కూడిపూడి భరత్భూషణ్, సీనియర్ నాయకుడు కంచె రమణారావు, రాష్ట్ర దృశ్యకళల మాజీ చైర్మన్ కూడిపూడి శాంతి, తదితరులు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.


