నవ్విపోయిన నాణ్యత!
సర్కార్ పాఠశాలల్లో చిరిగిపోయిన బ్యాగ్లు, షూలతో అవస్థలు సగానికి పైగా మూలనపడ్డ బ్యాగులు సొంత డబ్బులతో కుట్టించుకొని నానా తంటాలు పడుతున్న విద్యార్థులు నాణ్యతలేని బ్యాగులిచ్చారంటూ మండిపడుతున్న తల్లిదండ్రులు
రెండు మాసాలకే చిరిగిపోయింది
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సర్కార్ పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగులు ఇతర సామగ్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. వాటి నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు నానాతంటాలు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత ఇస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన సామగ్రి మూడునాలుగు మాసాలకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 942 ప్రభుత్వ విద్యాసంస్థలు
ఎన్టీఆర్ జిల్లాలోని 20మండలాల్లో సుమారుగా 942 ప్రభుత్వ యాజమాన్య పరిధిల్లో కొనసాగే విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, మునిసిపల్ తదితర యాజమాన్యాల పేర్లతో అవి కొనసాగుతున్నాయి. ఆయా విద్యా సంస్థల్లో సుమారుగా లక్ష మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటుగా బ్యాగ్, షూస్, యూనిఫామ్ తదితర వస్తువులతో కూడిన కిట్లను అందించారు. సాధారణంగా పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులను దాదాపుగా నెల రోజుల తేడాతో వాటిని విద్యార్థులకు అందించారు.
ఇచ్చిన నెలకే చిరిగిపోయాయి..
ప్రభుత్వం అందించిన బ్యాగులు, షూస్ విద్యార్థులకు అందిన నెల రోజులకే చిరిగిపోయాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానంగా నాణ్యత లేని బ్యాగులు అందించటంతో చిరిగిపోయిన వాటిని కొంతమంది వాటిని కుట్టే వారికి అందించి డబ్బులిచ్చి కుట్టించుకున్నామని చెబుతున్నారు. మరికొంతమంది వారే సూదితో కుట్టుకొని అవస్థలు పడుతూ వినియోగిస్తున్నారు. కొంతమంది తమ బ్యాగులు ఎక్కడికక్కడ పీసులుగా ఊడిపోయి కుట్టడానికి సైతం కుదరకపోవటంతో వాటిని బయట పడేసి ఇతర బ్యాగులతో పాఠశాలలకు వస్తున్నారు. షూస్ పరిస్థితి సైతం అదే విధంగా ఉందని విద్యార్థులతో పాటుగా కొంతమంది ఉపాధ్యాయులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆగ్రహం..
చంద్రబాబు ప్రభుత్వం పాలనలో తమ పిల్లలకు బ్యాగులు, షూస్ ఇచ్చామనే పేరే తప్ప వాటిలో నాణ్యత లేదని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించే వస్తువులు నాణ్యత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు అందులోనూ చిన్నపిల్లలు వాడే వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరిగిపోయిన బ్యాగుల్లో పుస్తకాలు తీసుకువెళ్లటానికి చిన్నారులు నానా తంటాలు పడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా కూతురు జూపూడి ఎంపీపీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ప్రభుత్వం అందించిన స్కూలు బ్యాగు ఇచ్చిన రెండు నెలలకే చిరిగిపోయింది. పాఠశాలలో బ్యాగులు చిరిగిపోయిన ఒకరిద్దరికి రిట్నర్ తీసుకొని కొత్తవి ఇచ్చారు. కొందరికి అసలు ఇవ్వలేదు. ప్రభుత్వం నాణ్యమైన బ్యాగులు ఇస్తే మాకు సమస్య ఉండదు. పిల్లలు పుస్తకాలు తీసుకెళ్లాలంటే బ్యాగు మంచిగా ఉంటేనే సక్రమంగా పాఠశాలకు వెళ్లగలుగుతారు. ప్రభుత్వం ఈ సారి సీజన్కై నా మంచి బ్యాగులు ఇవ్వాలి.
– బాణావతు జగన్నాఽథం నాయక్,
జూపూడి గ్రామం,
ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. విద్యార్థులకు అందించే వస్తువుల విషయంలోనూ నాణ్యత లోపించటంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాగులు, షూస్ చిరిగిపోయి ఇబ్బందులెదుర్కొంటున్నారు. నాణ్యత విషయంలో రాజీపడటం సరికాదు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో గత ప్రభుత్వం హయాంలో జరిగిన నాడు–నేడు పనులు చివరి దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను చూడాలి. అప్పుడే విద్యార్థుల భవిత ఉజ్వలంగా ఉంటుంది.
– వానపల్లి రవీంద్ర,
వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత
నవ్విపోయిన నాణ్యత!
నవ్విపోయిన నాణ్యత!
నవ్విపోయిన నాణ్యత!
నవ్విపోయిన నాణ్యత!


