గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో వంట గ్యాస్కు కొరత లేదని.. బాట్లింగ్, సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. వినియోగదారులు వదంతులు నమ్మి ఆందోళన చెందొద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీలు, సరఫరా సంస్థలు వినియోగదారులకు సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 9154970454కు కాల్ చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
ఆకస్మిక తనిఖీ..
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) బాట్లింగ్ ప్లాంట్ను శుక్రవారం కలెక్టర్ జి. లక్ష్మీశ ఆకస్మికంగా సందర్శించారు. ప్లాంటు అధికారులతో సమావేశం నిర్వహించి ప్లాంటు కార్యకలాపాలు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో వంట గ్యాస్ కొరత ఉన్నట్లు కొన్ని అపోహలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


