తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం బీపీఎడ్–2026 2వ, 4వ సెమిస్టర్, బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ చాన్స్లర్ టీ యాదగిరిరావు వర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి, కంట్రోలర్ కే సంపత్కుమార్తో కలిసి మంగళవారం విడుదల చేశారు. బీపీఎడ్ 4వ సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. పరీక్షలకు మొత్తం 52 మందికి హాజరు కాగా అందులో 15 మంది బాలురు, 37 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నారు. 52 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వీసీ, రిజిస్ట్రార్ లు అభినందనలు తెలిపారు. బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 1,334 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 241 మంది బాలురు, 1,093 మంది బాలికలు ఉండగా 1,173 మంది ఉత్తీర్ణత సాధించారని వీసీ పేర్కొన్నారు. బీపీఎడ్ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం వంద మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 52 మంది బాలురు, 48 మంది బాలికలు ఉన్నారని, వారిలో 90 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు ఒక విద్యార్థికి గానూ ఒక విద్యార్థి హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఘనంగా ఇంజినీర్స్ డే
తెయూ(డిచ్పల్లి): యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విభాగాధిపతి నీలిమ అన్నారు. మహోన్నత ఇంజినీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని తెయూ అంబేడ్కర్ రీసెర్చ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విభాగాధిపతి నీలిమ ముఖ్యఅతిథిగా హాజరై మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధాన వక్త మధుసూదనాచారి, స్టడీ సర్కిల్ అధ్యక్షుడు అమృత్ చారి, వర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎస్తో నాయకత్వ లక్షణాలు
తెయూ(డిచ్పల్లి): జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) దినోత్సవాన్ని పురస్కరించుకుని తెయూ ఎన్ఎస్ఎస్ యూనిట్–4 ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వర్సిటీ వీసీ టీ యాదగిరిరావు వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ అంటే సేవ మాత్రమే కాదని, విద్యార్థులలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించే వేదిక అని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–4 ప్రోగ్రాం ఆఫీసర్ నర్సయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


