నిజామాబాద్ అర్బన్/ డిచ్పల్లి/ డొంకేశ్వర్/ బోధ న్ రూరల్/ నిజామాబాద్ రూరల్: వినాయక చవితి సందర్భంగా ఇందూరులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వీధివీధినా గణేశ్ మండపాలు, ప్రతి ఇంట్లో పూజలు, మోదకాల నైవేద్యాలతో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో గణేశ్ విగ్రహాలను మండపాల్లో యూత్ సభ్యులు, నిర్వాహకులు ప్రతిష్ఠించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతిష్ఠించిన వినాయకునికి అదనపు కలెక్టర్ వీ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత భక్తి శ్రద్ధలతో మంగళవారం పూజలు నిర్వహించారు. కలెక్టరేట్ ఏవో బాలరాజు, సూపరింటెండెంట్లు శ్రీనివాస్, భాస్కర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి మేనేజర్ మహేశ్, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సత్య (కర్ర) గణపతి కొలువుదీరింది. మొదటి, రెండవ రోజు గణపతిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.


