బోధన్టౌన్(బోధన్): నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి(సుమారు 60 ఏళ్లు) శనివారం మృతి చెందారు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు.. ఈనెల 10న బోధన్ బస్టాండ్ సమీపంలో యాచిస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో 108 అంబులెన్స్లో నిజామాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి కుడి చేతిపై శివుని పచ్చబొట్టు, చేతికి కడియం ఉంది. ఆచూకీ తెలిసిన వారు 871265 69778, 87126 59870లకు సంప్రదించాలని సీఐ తెలిపారు.
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండలం చిట్టాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం అర్ధరాత్రి డీజే సౌండ్ సిస్టమ్తో న్యూసెన్స్కు కారణమైన గణేష్ మండప నిర్వాహకులపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. గణేష్ ఆగమన కార్యక్రమంలో నిర్వాహకులు డీజే సౌండ్ సిస్టమ్ వినియోగిస్తూ శబ్ద కాలుష్యం సృష్టించారని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
నవీపేట: మండల కేంద్రంలోని ధర్యాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. వివరాలు.. కాలనీకి చెందిన డాంగె నాగమణి ఈనెల 8న ఇంటికి తాళం వేసి ధర్మాబాద్లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి లోపలకు వెళ్లి, బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.30 వేల నగదుతో పాటు 7 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లారని బాధితులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


