డిచ్పల్లి: మండల శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండల శివారు నాగ్పూర్ గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉన్న ట్యాంకర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. శుక్రవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సీపీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను డిచ్పల్లి సీఐ కే వినోద్, ఎస్సై ఎండీ ఆరిఫ్ లను అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సూచనలు, హెచ్చరికలు లేకుండా వాహనాన్ని నిలిపివేయడం, ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలిసినట్లు ఆయన పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు.


