డొంకేశ్వర్(ఆర్మూర్): బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తికి అడవిపందికి అడ్డురావడంతో దానిని తప్పించబోయి కిందపడి మృతిచెందాడు. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గంగాసముందర్ గ్రామానికి చెందిన మీరొల్ల సాకలి ఊశన్న(45) మారంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్హౌస్లో ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఈనెల 6న సాయంత్రం తన విధులు ముగించుకొని మోపెడ్పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో అడవిపంది అడ్డురావడంతో మోపెడ్ వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన లింగవోల జీవన్(30)అనే వ్యక్తి ఈనెల 3న బైక్పై తాడ్వాయి నుంచి చందాపూర్ వైపు బయలుదేరాడు. ఇదే సమయంలో బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన దేవునిపల్లి శ్రావణ్ తన బైక్పై తాందాపూర్ నుంచి తాడ్వాయికి వస్తున్నాడు. ఈక్రమంలో మండలంలోని బాలికల గురుకుల పాఠశాల ఇరువురి బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీవన్కు తీవ్రగాయాలు కాగా, శ్రావణ్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీవన్ పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు అతడిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున జీవన్ మృతిచెందాడు. మృతుడికి భార్య గంగమణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
మాక్లూర్: మండలంలోని మాణిక్భండార్లో రాజు అనేవ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్రెడ్డి సోమవారం తెలిపారు. డిచ్పల్లి గ్రామానికి చెందిన రాజు కొన్నేళ్లుగా మాణిక్భండార్లో నివాసం ఉంటూ, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్గా పనిచేస్తున్నాడు. గత నెల 31న డిచ్పల్లిలో చిట్టీ డబ్బులు చెల్లించి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రాజు ఇప్పటికీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు.


