● అధికారుల హెచ్చరికలు బేఖాతరు
● అక్రమ రవాణాను అడ్డుకున్న
సిబ్బందితో వాగ్వాదం
బోధన్: సాలూర మండలంలోని తగ్గేల్లి గ్రామ శివారులోని మంజీర తీరంలో ఇసుక మాపియా ఆగడాలు మితిమీరిపోయాయి. నిబంధనలు, అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. గ్రామ అంచున ఉన్న మంజీర నది నుంచి ఇష్టారీతిన ఇసుకను తరలిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునే అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
సాలూర మండలం తగ్గేల్లి గ్రామ శివారులో డంప్ చేసిన ఇసుకను ట్రాక్టర్ డోజర్తో బొలేరోలో లోడ్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి తహసీల్దార్ అజ్మత్ నవాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఒక వీఆర్ఏ ఘటన స్థలానికి వెళ్లి, వాహనాలను పట్టుకున్నారు. దీంతో పదుల సంఖ్యలో ఇసుక వ్యాపారులు అక్కడి వచ్చి ఎంఆర్ఐతో వాగ్వాదానికి దిగి నట్టు సమాచారం. పట్టుకున్న బొలేరో, డోజర్ను ఎంఆర్ఐ కారును ఓవర్ టేక్ చేసి తీసుకువెళ్తుండగా పోలీసు కానిస్టేబుల్స్ వెంబడించి పట్టుకున్నట్టు తెలిసింది. వాటిని తహసీల్దార్ ఆఫీస్కు తరలించారు. ఈ ఘటనపై ఎంఆర్ఐ శంకర్ను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా పదుల సంఖ్యలో ఇసుక వ్యాపారులు వచ్చి రెండు గంటల పాటు ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. తహసీల్దార్కు రిపోర్టు చేశానని వివరించారు.


