నందిపేట్ (ఆర్మూర్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ ప్రతి వర్గానికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నందిపేటలో మండల పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ, సంబురాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో నగేష్రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టివేశారని, ప్రజల అవసరాల కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పాలన కొనసాగిస్తుందన్నారు. నాయకులు ఎర్రం లింగం, మారా చంద్రమోహన్, వెంకట్రాంరెడ్డి, గోపి, యాదగిరి, గంగాధర్గౌడ్, దయాకర్, మహిపాల్, సాయిరెడ్డి, సాయిబాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


