● క్షేమంగా తల్లిదండ్రులకు
అప్పగించిన పోలీసులు
కమ్మర్పల్లి: అదృశ్యమైన ఓ బాలుడి ఆచూకీని గంటల వ్యవధిలోనే కనుగొని తమ పనితీరును కమ్మర్పల్లి పోలీసులు నిరూపించుకున్నారు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు ఇలా.. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్(15) అనే బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సతీష్ స్పందించి వెంటనే పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించారు. కానిస్టేబుళ్లు నరేష్, దినేష్, హరీష్లు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను నిశితంగా పరిశీలించారు. బాలుడి కదలికలను ట్రాక్ చేసి ఆర్మూర్లోని అంబేడ్కర్ చౌరాస్తాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి బాలుడిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అదృశ్యమైన తమ కొడుకు ఆచూకీని గంటల వ్యవధిలోనే కనిపెట్టి సురక్షితంగా అప్పగించినందుకు పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


