జిల్లాలో సీఎం బ్రేక్ఫాస్ట్ అమలు దిశగా అడుగులు
ఆర్మూర్ : ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు పొద్దున్నే మిల్లెట్ ఇడ్లీ, బజ్జి, ఉప్మా, పూరి, దోశ అల్పాహారంగా అందనున్నాయి. జిల్లాలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ అమలు దిశగా అధికారయంత్రాంగం అడుగులు వేస్తోంది. విద్యార్థులకు పో షకాహారం అందిస్తూ వారు ప్రతి రోజూ పాఠశాలకు వచ్చేందుకు ఈ పథకం తోడ్పడనుంది. హరే కృష్ణ ఫౌండేషన్కు ఇప్పటికే అక్షయపాత్ర పథకం ద్వారా మధ్యాహ్న భోజన సేవల్లో అనుభవం ఉండటంతోపాటు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండటంతో బాధ్యతలను ఆ సంస్థకే అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లేట్ టిఫిన్ కు రూ.10 చొప్పున ఫౌండేషన్కు చెల్లించనుండగా, అదనపు నిధులను హరేకృష్ణ సంస్థ విరాళాల రూపంలో సేకరించనుంది. జిల్లాలో 1,177 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,07,576 మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ను మెనూ ప్రకారం అందించనున్నారు. ఈ పథకంతో విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
సెంట్రల్ కిచెన్ నుంచి సరఫరా..
వారంలో ఆరు రోజులపాటు విద్యార్థులకు ముందుగా నిర్ణయించిన ఆహార పదార్థాలను బ్రే క్ఫాస్ట్గా అందించనున్నారు. వేడివేడిగా తయా రు చేసిన అల్పాహారాన్ని వాహనాల ద్వారా పాఠశాలలకు చేరవేయనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో సెంట్రల్ కిచెన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. సెంట్రల్ కిచెన్ నుంచే పాఠశాలలకు వాహనాల ద్వారా బ్రేక్ఫాస్ట్ సప్లై కానుంది. సెంట్రల్ కిచెన్లో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
ఏఎంసీ గోదాము పరిశీలన..
సీఎం బ్రేక్ ఫాస్ట్ సెంట్రల్ కిచెన్ ఏర్పాటు కోసం ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డు ప్రాంగణంలోని గోదాములను అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ ఐఏఎస్ పామూరు సురేష్ మంగళవారం పరిశీలించారు. హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు సుచిత్రెడ్డి, విద్యాశాఖ అధికారులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో వారు చర్చించారు. వారి వెంట జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ గంగు, సమగ్ర శిక్ష సెక్టోరల్ ఆఫీసర్ పడకంటి శ్రీనివాస్రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి, మార్కెటింగ్ శాఖ సిబ్బంది మురళి తదితరులున్నారు.
సెంట్రల్ కిచెన్ ఏర్పాటుకు సన్నాహాలు
పరిశీలనలో ఆర్మూర్,
బోధన్ పట్టణాలు
‘హరే కృష్ణ’ ఆధ్వర్యంలో
విద్యార్థులకు అల్పాహారం


