జక్రాన్పల్లి: వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మండలంలోని మునిపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీని పరిశీలించారు. వంట గది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి అసంతప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీని మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ సెకండియర్ తరగతి గదికి వెళ్లి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. తహసీల్దార్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ అనూష తదితరులు ఉన్నారు.


