ఎస్సీ స్టడీ సర్కిల్లో వార్డెన్ చేతివాటం
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలోని ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్లో వార్డెన్ సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పట్టుకున్నారు. నాందేవ్వాడలోని ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్సీ వసతి గృహం ఉంది. ఆదివారం ఉదయం హాస్టల్ విద్యార్థులు తినే రెండు క్వింటాళ్ల సన్న బియ్యాన్ని వార్డెన్ జీవన్ అక్రమంగా కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. హాస్టల్లో కొన్ని రోజుల నుంచి సన్న బియ్యం వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఎస్సై హరిబాబును వివరణ కోరగా వార్డెన్ జీవన్ సన్న బియ్యాన్ని ఇంటికి తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశామని, సంబంధిత డిపార్ట్మెంట్కు లేఖ రాసినట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి రాజగంగారాంను వివరణ కోరగా తాను ఎన్నికల విధుల్లో ఉన్నందున ఏఎస్డబ్ల్యూతో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం తరలిస్తు పట్టుబడ్డ హాస్టల్ వార్డెన్ జీవన్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు.
నిజామాబాద్ అర్బన్: సీఎం కప్ జిల్లా స్థాయి యోగాసన పోటీలను నగరంలోని బాలభవన్లో ఆదివారం నిర్వహించారు. మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా, వివిధ మండలాల నుంచి సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ యోగాసన పోటీల్లో పాల్గొంటారని జిల్లా యువజన క్రీడా అధికారి పవన్కుమార్ తెలిపారు.
రుద్రూర్: పొతంగల్ మండలం సుంకిని గ్రామ శివారులోని మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా సుంకిని గ్రామ శివారులోని మంజీరా నది వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను గుర్తించి కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎస్సీ స్టడీ సర్కిల్లో వార్డెన్ చేతివాటం


