36 వార్డులు గెలిపిస్తే రూ.కోటి నజరానా
● రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఆర్మూర్: పట్టణంలోని 36 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే తన శాఖ తరఫున రూ.కోటి నజరానా ఇస్తానని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 17వ వార్డులో చైర్పర్సన్ ఆశావహురాలు ఏబీ శ్రీదేవి (చిన్న)తోపాటు పెర్కిట్ చౌరస్తా, గోల్బంగ్లా, కాశీ హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు, రేషన్లో సన్నబియ్యం, కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని దుస్థితిని గుర్తు చేశారు.
34వ వార్డులో సుదర్శన్రెడ్డి...
పట్టణంలోని 34వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్మె నవీన్ను గెలిపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సైతం ఆయన ప్రచారం కొనసాగింది. వారి వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ (చిన్న), ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, పట్టణ, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


