కౌన్సిలర్.. ఎమ్మెల్యే.. మంత్రి
● 1981 మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచిన
డి సత్యనారాయణ
● 1983, 1985 ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా విజయం
● ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా..
● ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది శాఖల బాధ్యతలు
● డి సత్యనారాయణ, మాజీ మంత్రి
సుభాష్నగర్: రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన డి సత్యనారాయణ కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి వరకు పని చేశారు. నగరంలోని కు మార్గల్లీకి చెందిన సత్యనారాయణ తండ్రి దుగ్యా ల శివయ్య సొంత లారీకి డ్రైవర్ కాగా తల్లి రాజమల్లమ్మ గృహిణి. విద్యార్థి దశ నుంచే సత్యనారాయణ చురుగ్గా ఉండేవారు. డిగ్రీ చదివే రోజుల్లో గిరిరాజ్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడి (రెండో)గా వ్యవహరించారు. 1981లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మిర్చి కంపౌండ్ ఏరియా నుంచి కౌన్సిలర్గా విజయం సాధించారు. చైర్మన్ స్థానానికి పోటీపడగా, అధిష్టానం గంగాకిషన్ పేరును ప్రకటించింది. 1983లో ఎన్టీ రామారావు ఆయనను పిలిచి అసెంబ్లీ టికెట్ ఇవ్వగా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డి శ్రీనివాస్పై 13వేల ఓట్ల మెజార్టీతో సత్యనారాయణ విజయం సాధించారు.
అదృష్టం వరించడంతో మంత్రిగా..
ఎమ్మెల్యేగా విజయం సాధించిన మొదటిసారే డి సత్యనారాయణకు మంత్రిగా అదృష్టం వరించింది. ఎన్టీఆర్ కేబినెట్(1984)లో మైన్స్, జియాలజీ మంత్రిగా వ్యవహరించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్ బిన్ హందాన్పై డి సత్యనారాయణ 9,321 ఓట్లతో గెలుపొందారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఏకై క వ్యక్తి డి సత్యనారాయణ. 1989 (టీడీపీ), 1994 (బీజేపీ) ఎన్నికల్లో వరుస ఓటములతో రాజకీయాలకు దూరమయ్యారు.హైదరాబాద్లో సాదాసీదా జీవితం గడుపుతున్న ఆయన జిల్లాకు రైలులోనే వస్తు వెళ్తుంటారు. జిల్లాకు వచ్చినప్పుడు అనుచరులను కలుస్తుంటారు. నిజామాబాద్ శిథిలావస్థకు చేరిన భవనం, హైదరాబాద్లో ఒక ఇల్లు మాత్రమే ఆయన ఆస్తి. మాజీ మంత్రిగా అందుతున్న పింఛన్తోనే కాలం వెళ్లదీస్తున్నారు.
పదవులకే వన్నెతెచ్చిన వ్యక్తి..
డి సత్యనారాయణ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో బస్టాండ్ల నిర్మాణం జరిగింది. జిల్లాకేంద్రానికి ప్రభుత్వ బాలికల ఐటీఐ, బాలికల పాలిటెక్నిక్ కళాశాలను తీసుకొచ్చారు. బాలికల ప్రభుత్వ పాఠశాలను అప్గ్రేడ్ చేసి కళాశాల, వసతిగృహాన్ని నిర్మించారు. రాజారాం స్టేడియం, పాత కలెక్టరేట్ భవనం, గ్రంథాలయ భవన నిర్మాణం జరిగింది. చంద్రశేఖర్ కాలనీ, పాములబస్తీ, వినాయక్నగర్, 350 క్వార్టర్స్, తదితర ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఎగ్జిబిషన్ సొసైటీని ఏర్పాటుచేశారు.
డబ్బులు మిగిలేవి..
అప్పటి రాజకీయాలే వేరు. పోటీ ఉన్నప్పటికీ ఖర్చు మా త్రం అంతంత మాత్రమే. ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటే ఇరుగుపొరుగు వారు, స్నేహితులు డబ్బులు పోగు చేసి ఇచ్చేవారు. ఎన్నికలు పూర్తయ్యేసరికి జమ చేసిన డబ్బులు కూడా మిగిలేవి. ప్రస్తుత రాజకీయ నాయకులు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిసారించాలి. చేసిన పనులే ప్రజాప్రతినిధులను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి.
కౌన్సిలర్.. ఎమ్మెల్యే.. మంత్రి
కౌన్సిలర్.. ఎమ్మెల్యే.. మంత్రి


