సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం
నిజామాబాద్ రూరల్: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రేషన్కార్డు లబ్దిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇది చరిత్రాత్మక నిర్ణయమని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని దుబ్బ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి పదేళ్లలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు కోట్ల 13 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో తెల్లరేషన్కార్డులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని ఘర్షణ పరిస్థితులు తెస్తోందని ఘాటుగా విమర్శించారు. వారికి అభివృద్ధి, సంక్షేమం పట్టదన్నారు. ఎంపీ నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం ఆయన హోదాకు తగదన్నారు.
ప్రజల కోసం సీఎం పనిచేస్తున్నారు
సీఎం రేవంత్రెడ్డి అహర్నిషలు ప్రజల కోసం పని చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తన స్థాయి కి మించి మాట్లాడుతున్నారని, ఆయన జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ఎంపీ ఆటలు నిజామాబాద్ జిల్లాలో సాగవని హెచ్చరించారు. హిందూముస్లింలకు కొట్లాట పెట్టి ఓట్లు దండుకునే రీతిలో ఎంపీ అరవింద్ ఉన్నారని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకురాలు కవితారెడ్డి, రత్నాకర్, ధర్మపురి సంజయ్, జావిద్ అక్రమ్, ఆయా డివిజన్ల అభ్యర్థులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ
దూసుకుపోతోంది
బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకుంటోంది
కార్నర్ మీటింగ్లో మంత్రి
ఉత్తమ్కుమార్రెడ్డి


