
మా వాళ్లను విడిపించి..స్వదేశానికి రప్పించండి
● ప్రవాసీ ప్రజావాణిలో గల్ఫ్ బాధిత కుటుంబాల వినతి
● బహ్రెయిన్లో జిల్లావాసులకు రెండేళ్ల జైలు
డిచ్పల్లి/ఇందల్వాయి: కంపెనీ చేయించిన తప్పుడు పనులతో బహ్రెయిన్లో జైలు శిక్ష పడిన తమ వాళ్లను విడిపించి, స్వదేశానికి రప్పించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన బాధిత కుటుంబీకులు మంగళవారం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామానికి చెందిన తిమ్మజాడ సంతోష్(24), డిచ్పల్లి గ్రామానికి చెందిన నకిడి లింబాద్రి(24), రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కర్రోళ్ల లక్ష్మీనర్సింహలు గత మే నెలలో ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లారు. పనిచేసే కంపెనీ 19 మందితో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తుల లేబుల్లు, తేదీలని మార్పించి అమ్మకం, నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించింది. దీంతో అక్కడి ప్రభుత్వం కంపెనీకి లక్ష దినార్లు(రూ.2.3కోట్లు) జరిమానాతోపాటు పనిచేస్తున్న 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో జిల్లాకు చెందిన ముగ్గురూ ఉన్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ డా.బీఎమ్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిల సహకారంతో మంగళవారం హైదరాబాద్లోని ప్రవాసి ప్రజావాణిని ఆశ్రయించారు. నోడల్ అధికారి దివ్య దేవరాజన్కి తమ వారిని విడిపించి స్వదేశానికి రప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి క్షమాభిక్ష లభించేలా చూడాలని కోరారు. స్పందించిన ఆమె సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వీ.శేషాద్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. బహ్రెయిన్లో సామాజిక సేవకుడు కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీ ద్వారా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు మంద భీంరెడ్డి తెలిపారు.