
ఆ గ్రామాల్లోనే ఇందిరమ్మ
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం భారీగా ఉన్నా పనుల్లో పురోగతి అంతంత మాత్రమే కనిపిస్తోంది. సాంకేతిక అనుమతులు ఇవ్వడంలో జాప్యం, గృహ నిర్మాణ సంస్థలో అరకొర సంఖ్యలో ఉద్యోగులు ఉండడం, వారిపై తీవ్రమైన పనిభారం తదితర కారణాలతో ఆశించిన వేగం కనిపించడం లేదు. ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే గణతంత్ర దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. జిల్లాలోని 31 గ్రామాల్లో 2,762 ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఆమోదం తెలిపారు. ఇందులో 654 ఇళ్ల నిర్మాణ పనులు మొదలు కాగా, 107 మాత్రం బేస్మెంట్ దశకు వచ్చాయి. ఇప్పటి వరకు తొలి విడత సాయం రూ.లక్ష చొప్పున కేవలం 65 మంది ఖాతాల్లో జమయ్యాయి. వాస్తవానికి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. తొలి విడతలో కేవలం ఎంపిక చేసిన గ్రామాలలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండగా ఇతర గ్రామాల్లో అనుమతి ఇవ్వక పోవడంతో భారీ లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ సంస్థను ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలతోనే నెట్టుకువస్తోంది. అదనంగా ఇంజినీర్లను నియమించి చెల్లింపుల్లో వేగం పెంచడం, మంజూరు ఇస్తేనే ఆశించిన విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
ఇతర గ్రామాల్లో విస్తరణకు
నోచుకోని ఇళ్ల పథకం
మొదటి దశలో 65 మందికి మాత్రమే అందిన రూ.లక్ష సాయం
పని భారం పెరిగింది
గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారం తీవ్రమైంది. గతంలో నియోజకవర్గానికి ఒక ఏఈ, మండలానికి ఇద్దరు ముగ్గురు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది.
– సత్యనారాయణ,
గృహ నిర్మాణ సంస్థ ఏఈఈ