
పాఠశాలల కుదింపు ప్రయత్నాలను విరమించుకోవాలి
నిజామాబాద్ అర్బన్: పాఠశాలల కుదింపు ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. శామ్యూల్ హితవు పలికారు. జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటైన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ప్రజల పిల్లలందరికీ నాణ్యమైన ఉచితమైన విద్యనందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విద్యా రంగ లక్ష్యాలు నెరవేరాలంటే కామన్ స్కూల్ విద్యా విధానం ఒకటే పరిష్కార మార్గమని, ఈ విధానాన్ని అమలు చేయాలని డాక్టర్ డీఎస్ కొఠారి కమిషన్ 1966లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందని తెలిపారు. కానీ నేటికీ ప్రభుత్వాలు కామన్ స్కూల్ విధానం అమలు చేయాలనే ఆలోచన చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా కామన్ స్కూల్ విధానంపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కౌన్సిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వార్షిక కౌన్సిల్స్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి కె. ఒమాజీ డీటీఎఫ్ కార్యకలాపాలపై కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం నివేదికపై సుదీర్ఘంగా కౌన్సిల్లో చర్చించిన అనంతరం నివేదికను ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదించింది. డీటీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
కామన్ స్కూల్ విధానం అమలు చేయాలి
డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్