
భూ వివాదాల పరిష్కారానికి ‘భూ భారతి’
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
రుద్రూర్/ వర్ని : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని, రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పేర్కొన్నారు. రుద్రూర్, వర్ని మండలాల్లో భూ భారతి చట్టంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. భూములకు సంబంఽధించిన వివాదాలను తొలగించి, పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు.ఽ ధరణి పోర్టల్లో లేని పలు సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ధరణిలో ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని, భూ భారతి చట్టం ప్రకారం తహసీల్దార్ స్థాయిలో న్యాయం జరగకపోతే ఆర్డీవోకు, అక్కడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. వివిధ గ్రామాల రైతులు భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరలోనే గ్రామాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి ఆర్జీలు స్వీకరించి పరిష్కారిస్తామన్నారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలు, ప్రయోజనాలను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్లు తారాబాయి, సాయిలు, ఎంపీడీవోలు వెంకటేశ్, భీమ్రావ్, మాజీ జడ్పీటీసీ నరోజి గంగారాం, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, విండో వైస్ చైర్మన్ తోట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.