
దళారులను నమ్మి మోసపోవద్దు
నిజామాబాద్ రూరల్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కేంద్రంలోని కోటగల్లి సొసైటీ చైర్మన్ కొట్టాల రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సొసైటీ ఆధ్వర్యంలో సాయినగర్ ఆకుల పాపయ్య రోడ్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని సొసైటీకి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. నాణ్యమైన వరి ధాన్యం తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, సీఈవో వంశీకృష్ట, రైతులు హన్మాండ్లు, గంగాధర్ పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన
ఖలీల్వాడి: నిజామాబాద్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఖానాపూర్ ఆర్కే ఇండస్ట్రీస్లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు, యాజమాన్యానికి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించినట్లు ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు శుక్రవారం తెలిపారు. అగ్గిమాపక సిబ్బంది కె.సుమన్, బి.కిరణ్ కుమార్, ప్రశాంత్ గౌడ్, సురేందర్, కార్మికులు పాల్గొన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు