డీఎస్‌ నా రాజకీయ గురువు : ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎస్‌ నా రాజకీయ గురువు : ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Feb 17 2024 12:48 AM | Updated on Feb 17 2024 12:19 PM

- - Sakshi

నిజామాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో గల మూన్నూరుకాపు కల్యాణ మండపంలో ఆయనకు పార్టీ శ్రేణులు నిర్వహించిన సన్మానసభ మాట్లాడారు. కాంగ్రెస్‌లో కష్టపడి పని చేస్తే గుర్తింపు వస్తుందన్నారు. మారుమూల గిరిజన గ్రామమైన రాహత్‌నగర్‌ నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌, టీపీసీసీలో పనిచేశానన్నారు.

రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, సీఏం రేవంత్‌రెడ్డితో చొరవతోనే ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పులు చేసి కాంగ్రెస్‌కు చిప్ప ఇచ్చా రని శాసనమండలి సమావేశాలలో తాను ఎమ్మెల్సీ కవితతో అన్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులను తీరుస్తుందన్నారు. ప్రజాగ్రహానికి గురై కేసీఆర్‌ ఇంటికి పోయాడన్నారు. ప్రజల చేతనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ వదిలేసిన 30 వేల ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలను అందించిందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో మరో లక్ష ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) తన రాజకీయ గురువని స్పష్టం చేశారు. 1983లో డీఎస్‌ ద్వారా తాను ఎన్‌ఎస్‌యూఐలోకి వచ్చినట్లు మహేశ్‌ గౌడ్‌ తెలిపారు. బీజేపీ ఓట్ల కోసం మతం, ప్రాంతాల వారీగా విభజన చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, నాయకులు పని చేయాలన్నారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీవిప్‌ ఈరవత్రి ఆనిల్‌, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్‌, బాడ్సిశేఖర్‌గౌడ్‌, గడుగు గంగాధర్‌, నగర అధ్యక్షులు కేశవేణు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భక్తవత్సలం(ఢిల్లీ), దిగంబర్‌పవార్‌, దిలీప్‌పవార్‌, అశోక్‌గౌడ్‌, జయసింహాగౌడ్‌, రామార్తి గోపి, ప్రీతం, వైశాక్షి సంతోష్‌, వేణుగోపాల్‌యాదవ్‌, రాజనరేందర్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ సాయిలు, ఎన్‌ఎస్‌ యూఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్‌, పంచరెడ్డి చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement