న్యూస్రీల్
హోటళ్లు, బేకరీలు కాదేదీ కల్తీకి అనర్హం కాలం చెల్లిన కేకులు.. బూజుపట్టిన బ్రేడ్లు.. వాడిన నూనెలతో తినుబండారాలు జిల్లాలో ఆహారాల పరిస్థితి ఇదీ..
నిర్మల్ అర్బన్ జట్టు విజయం
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని లక్కీ క్రికెట్ మైదానంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–23, టీ20 క్రికెట్ సిరీస్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో నిర్మల్ రూరల్, అర్బన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా జరిగిన పోరులో నిర్మల్ అర్బన్ జట్టు విజయం సాధించింది. అనంతరం చాణక్య పాఠశాల యజమాని వెంకట్రెడ్డి విజేతకు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో కోచ్ రామరాజు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నిర్మల్: జిల్లాలో హోటళ్లు, బేకరీలు, స్వీట్హోమ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా.. లేదా అనే అనుమానం పెరుగుతోంది. తాజాగా పేరున్న ఓ బేకరీలో కేక్ తిని ఒక చి న్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఓ స్వీట్హోమ్లో నాణ్యత ప్రమాణా లు లేని తినుబండారాలు విక్రయించడం కలకలం రేపుతోంది. ఏడాది క్రితం జిల్లా కేంద్రంలోని గ్రిల్ నైన్ హోటల్లో నిషేధిత మయోనైజ్ వినియోగంతో ఓ మహిళ మరణించింది. పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది కూడా కల్తీ, ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతమవుతున్నాయి.
ఎక్కడ పడితే అక్కడే...
దుమ్ము ధూళి పడే రోడ్డు పక్కన, మురికి కాలువల వెంట, టాయిలెట్ల పక్కనే తోపుడు బండ్లపై టిఫిన్లు, బజ్జీలు విక్రయిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. చాలా హోటళ్లలో వంటగది శుభ్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముడి పదార్థాల నాణ్యత, ఫ్రిజ్లలో నిల్వలు, తయారైన ఆహారాన్ని భద్రపరిచే విధానం, తయారైన ఆహారానికి గడువు తేదీలు, ఫుడ్ హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో లోపాలు కనిపిస్తున్నాయి. వీటిపై నిరంతర తనిఖీలు అత్యవసరం.
అరకొర సిబ్బంది..
ఆహార తయారీ, నిల్వ, విక్రయ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాల్సిన ఫుడ్ సేఫ్టీ యంత్రాంగానికి సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారింది. ఉన్న పరిమిత అధికారులకు రెండు, మూడు జిల్లాలను ఇన్చార్జ్గా అప్పగిస్తున్నారు. వారు అరకొర సిబ్బందితో అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు వారిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇటీవల ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం అధికారులు, సిబ్బంది నియామకాలను వేగవంతం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
‘నాన్నా.. కేక్ కొనియ్యవా..!’ అంటూ బిడ్డ అడగగానే ఆ తండ్రి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఓ పేరున్న బేకరీకి వెళ్లి కేక్ తీసుకున్నాడు. అనంతరం ఇతర పనులు చూసుకుని ఇంటికి వెళ్లారు. వెంటనే ఆ చిన్నారి కేక్ తీసుకుని తినేసింది. కాసేపటికే వాంతులు, విరోచనాలు చేసుంది. ఎంతకూ తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. అనుమానం వచ్చిన తండ్రి చిన్నారి తనగా మిగిలిన కేక్ను పరిశీలించాడు. కిందిభాగం మొత్తం బూజుపట్టి, పాడైపోయి ఉంది. ఐదు రోజుల తర్వాత బిడ్డ కోలుకోవడంతో ఇంటికి వెళ్లారు. చికిత్సకు రూ.50 వేల వరకు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలా.. ఇటీవల జిల్లాలో తరచూ ఫుడ్పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా పలు బేకరీలు, హోటళ్లు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తనిఖీ చేయాల్సిన శాఖలో సిబ్బంది కొరత ‘ఫుడ్ పాయిజన్’లకు కారణమవుతోంది.
ప్రాణాలతో చెలగాటం
జిల్లాలో రోజురోజుకూ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ లు, స్వీట్హోమ్లు, టిఫిన్ సెంటర్లు కొత్తకొత్తవి పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు లెక్కే లేదు. ఎంతవరకు నాణ్యమైన వస్తువులు వా డుతున్నారు, ఎలాంటి నూనెలు వినియోగిస్తున్నా రు అనేది అనుమానాస్పదంగా మారింది. వాడిన నూనెలనే మళ్లీమళ్లీ వాడటంతో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. చాలా చోట్ల ఏమాత్రం పరిశుభ్రత పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తరచూ తనిఖీలు..
జిల్లాలో తరచూ తనిఖీలు చేపడుతున్నాం. మున్సిపల్, రెవెన్యూ సిబ్బందితో కలిసి హోటళ్లు, దుకాణాలు, పండ్ల వ్యాపారుల వద్దకూ వెళ్తున్నాం. ఎక్కడ నుంచి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం. కలెక్టరేట్లో పూర్తిస్థాయి కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆహార భద్రత కోసం మరిన్ని కఠిన చర్య తీసుకుంటాం.
–టి.సునీత, జిల్లా ఇన్చార్జి
ఫుడ్సేఫ్టీ అధికారి


