నిర్మల్
న్యూస్రీల్
గెలుపు గుర్రాల కోసం పార్టీల ఆరా కాంగ్రెస్, బీజేపీల్లో పెరిగిన ఆశావహులు బీఆర్ఎస్లో డీలా..
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రత నిర్వహించాలన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ ఉన్నారు.
నిర్మల్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో రాజకీయ పార్టీలూ సన్నద్ధమవుతున్నాయి. ఈసారి జిల్లాలో పురపోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆచితూచి అడుగులేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ నుంచి సీనియర్లతోపాటు గల్లీ లీడర్లూ కాంగ్రెస్, బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సొంతపార్టీలోనే అభ్యర్థిత్వం కోసం ఆశావహుల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. భైంసా, ఖానాపూర్తో పోలిస్తే.. నిర్మల్లో సీట్ల కోసం సిగపట్ల వరకూ పరిస్థితి వెళ్లేలా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వార్డుల్లో గెలిచేది, చైర్మన్ స్థానాన్ని గెలిపించేది ఎవరనే వేటలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లను అంచనా వేస్తూ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.
ఐదేళ్లలో మార్పులెన్నో..
ఐదేళ్లక్రితం మున్సిపోల్స్కు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ముందు నుంచీ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు దేనికదే అన్నట్లుగా ఉన్నాయి. నిర్మల్లో గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లతోపాటు బీజేపీ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. ఖానాపూర్లో కాంగ్రెస్, బీజేపీలు అప్పటి అధికార బీఆర్ఎస్తో బలంగానే పోరాడాయి. ఇక భైంసాలో ఎంఐఎం పైచేయి సాధించినా ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ను కనుమరుగు చేస్తూ బీజేపీ గణనీయస్థానాలను సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను సీనియర్లందరూ వీడారు. మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, అలాగే సీనియర్ నేతలు చాలామంది కాంగ్రెస్లో చేరారు. మరికొందరు బీజేపీలోకి వెళ్లారు. కిందిస్థాయి నేతలూ వారిబాటలోనే పార్టీలు మారారు. దీంతో మున్సిపాలిటీల్లోనూ రాజకీయ లెక్కలు మారిపోయాయి.
జాబితా తయారీలో..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా మరో రెండురోజుల్లో ఫైనల్ కానుంది. తదుపరి రిజర్వేషన్ల ప్రకటన రానుంది. అన్నీ సజావుగా పూర్తయితే సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎన్నికలు అన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే పార్టీలు కూడా ఇప్పటి నుంచే వార్డులవారీగా ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరికి ఎంత బలముంది, ఎవరికి సీటిస్తే గెలుస్తారు.. ఇలా అన్నికోణాల్లో లెక్కలు వేస్తున్నాయి. జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోని ఓవర్గం ఇప్పటికే కొంతమంది ఆశావహులతో ఓ జాబితానూ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో మాత్రం అభ్యర్థుల ప్రకటన ఎమ్మెల్యేలపైనే ఆధారపడి ఉన్నట్లు చెబుతున్నారు.
ఖానాపూర్లో కొంత ప్రభావం చూపడం మినహా మిగిలిన రెండు బల్దియాల్లో బీఆర్ఎస్ అంత బలంగా లేదన్న వాదన వినిపిస్తోంది. ముందు నుంచీ తమపార్టీల్లో ఉన్న సీనియర్ నేతలతోపాటు బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులూ కౌన్సిలర్ టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీల్లో పోటీ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు బీజేపీవాళ్లు గెలవడం, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల నుంచే టికెట్లు ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాకేంద్రంలో రెండు పార్టీల్లో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు ఆశావహులు ఉండటం గమనార్హం.
నిర్మల్


