
‘లేబర్ కోడ్స్ రద్దుకు పోరాడాలి’
నిర్మల్చైన్గేట్: కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దుకు పోరాడాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్ సంఘ భవనంలో కార్మిక సంఘాల జిల్లా సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా అమలు చేయాలని చూస్తోందన్నారు. కార్మికుల శ్రమను దోచి పెట్టుబడిదారుల జేబులు నింపడానికే ఈ లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పీ.జయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్, ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసచారి, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సూర్య శివాజీ, జిల్లా అధ్యక్షుడు సునాకరి రాజేశ్, జిల్లా కార్యదర్శి హరిత, తదితరులు పాల్గొన్నారు.
‘ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి’
నిర్మల్చైన్గేట్: ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఆదివాసీ, మావోయిస్టులపై సైనికుల దాడులు ఆపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే.రాజు డిమాండ్ చేశారు. కర్రెగుట్టను చుట్టుముట్టిన సైనిక బలగాలు వెనక్కి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్, ఒరిస్సా కేంద్రంగా ఉన్న దండకారణ్యంలో సహజ వనరులను కార్పొరేట్లకు అప్పజెప్పడమే లక్ష్యంగా, అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలను, అడవికి రక్షణగా ఉన్న మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగర్ పేరుతో చంపుతున్నారని విమర్శించారు. వెంటనే చర్చలు జరిపి ఆదివాసీలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎం.హరిత, సునరికారి రాజేశ్, వెంకటేశ్, రాజన్న, మల్లక్క పాల్గొన్నారు.