ఒకేసారి నాలుగు రికార్డులు.. దేశానికే మైలురాయి | world New World Record Set During Delhi Mumbai Expressway Construction | Sakshi
Sakshi News home page

నాలుగు రికార్డులు నిర్మించారు..

Feb 6 2021 10:37 AM | Updated on Feb 6 2021 10:37 AM

world New World Record Set During Delhi Mumbai Expressway Construction - Sakshi

సాక్షి, ముంబై: రోడ్ల నిర్మాణంలో భారత్‌ అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ముంబై– ఢిల్లీలతో బడోదాను కలిపే ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం పనుల్లో ఒకేసారి 4 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. దీంతో గోల్డన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఈ నిర్మాణపనులు స్థానం సంపాదించుకున్నాయి. ఈ నాలుగు ప్రపంచ రికార్డులలో మొదటిది 12 వేల టన్ను సిమెంట్‌ కాంక్రీట్‌ను ఉత్పత్తి(తయారు)చేయడంకాగా, రెండోది కాంక్రీట్‌ను వేగంగా పంపిణీ(విడుదల) చేయడం. ఇక మూడో రికార్డు.. ఒక అడుగు మందం, 18.75 మీటర్ల వెడల్పుతో ఏకధాటిగా 2 కి.మీ.ల పొడవైన రోడ్డును నిర్మించడం. రిజిడ్‌పేవ్‌మెంట్, క్వాలిటీ మెయింటెయిన్‌ చేయడంతో నాలుగో రికార్డు సాధ్యమైంది. ఇవన్ని కేవలం 24 గంటల్లో పూర్తి చేయడం విశేషం. ఇలా ఎక్స్‌ప్రెస్‌ హైవే ఒకేసారి 4 ప్రపంచ రికార్డులను సృష్టించింది. గుజరాత్‌లో ప్రస్తుతం బడోదా నుంచి భారూచ్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు జరుగనున్నాయి. ఫిబ్రవరి 2న 23 గంటల్లో 2 కి.మీ.ల పొడవు, 18.75 వెడల్పు రోడ్డును కేవలం 24 గంటల్లో నిర్మించారు. ఇందుకోసం 1.10 లక్షల సిమెంట్‌ బస్తాలు (5.5 టన్నులు), 500 టన్నుల ఐస్‌ను వాడారు. మొత్తం రూ. 5 కోట్లు ఖర్చయింది.  
చదవండి: రాజీవ్‌ హత్య కేసు: రాష్ట్రపతి భవన్‌కు క్షమాభిక్ష

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో విశేషాలు.. 
►1250 మంది పనులు చేశారు.  
► గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కోసం 
►  115 ట్రిప్పర్‌ ట్రక్కుల వినియోగం 
► మెకానికల్‌ విభాగంలో 300 మంది పనిచేశారు. 
► 250 మంది ప్రొడక్షన్‌ యూనిట్‌ బాధ్యతలను చేపట్టారు.  

దేశానికి మైలురాయి: అరవింద్‌ పటేల్‌ 
‘ఒకేసారి నాలుగు రికార్డులు సృష్టించడం అనేది దేశానికే మైలురాయి. ఈ రికార్డును అంత తొందరగా సులభంగా ఏ సంస్థా బద్దలు కొట్టబోదు. ఇది కేవలం రికార్డు సృష్టించడంకాదు. ఆధునిక భారత ముఖచిత్రం’ అని పటేల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సంస్థ ఎండీ అరవింద్‌ పటేల్‌ అభివర్ణించారు. ‘ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక బెంచ్‌మార్కు. నిర్మాణం ఇంకా వేగవంతం కానుంది. మా ప్లాంట్‌లో ప్రస్తుతం గంటకు 840 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ను తయారుచేస్తున్నాం’ అని ఆయన అన్నారు. కాంక్రీట్‌ ఉత్పత్తి కోసం జర్మనీ నుంచి రూ. 20 కోట్లు వెచ్చించి మూడు అధునాతన యంత్రాలను తెప్పించామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement