
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజును పురస్కరించుకుని తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ మాదిరిగానే తానూ భారత్-అమెరికా భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు.
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో.. ‘నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోనులో మాట్లాడాను. ఆయనకి నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు' అని ట్రంప్ పేర్కొన్నారు.
PM Modi posts, "Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful… pic.twitter.com/CQGdwOKiBH
— Press Trust of India (@PTI_News) September 16, 2025
దీనికి బదులుగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో ‘అధ్యక్షుడు ట్రంప్ నా 75వ పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందుకు నా మిత్రునికి ధన్యవాదాలు. మీ మాదిరిగానే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేపట్టిన చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జూన్ 17 తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం ఇదే తొలిసారి. రష్యా నుంచి భారత్ స్వల్ప ధరలకే చమురు దిగుమతి చేసుకొని భారీగా లాభాలు పొందుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే భారత్పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. అలాగే భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పారు. దీనిని భారత్ పలుమార్లు ఖండించింది. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.