వయనాడ్లోని కల్లడిలో మట్టిదిబ్బ కూలిన ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
కేరళలో ముగ్గురి మృతి?
ఆరుగురికి గాయాలు
హెచ్చరించినా పట్టించుకోలేదు: కేరళ సీఎం
మట్టి దిబ్బ ధాటికి కొట్టుకుపోయిన లారీ
వయనాడ్/తిరువనంతపురం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కేరళలోని వయనాడ్లో భారీ విపత్తుకు కారణమైంది. కోజికోడ్ – వయనాడ్ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన భారీ జంట సొరంగ మార్గం కోసం తవి్వన మట్టి వర్షం కారణంగా అకస్మాత్తుగా జారిపోవడంతో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వయనాడ్ జిల్లాలోని కల్లడి ప్రాంతంలోని మేప్పడి గ్రామం వద్ద నిర్మాణమవుతున్న మీనాక్షి వంతెన వద్ద మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కుప్పగా పోసిన మట్టిని తొలగించాలని జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సొరంగం నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను చాలాకాలం క్రితమే హెచ్చరించినా పట్టించుకోక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదో దురదృష్టకర సంఘటన. సహాయక చర్యలు చేపట్టాము’’అని తెలిపారు. వాతావరణ హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనడం సరికాదని సకాలంలో మట్టి తొలగించకపోవడం కారణమని వివరించారు.
ఉన్నట్టుండి కుప్పకూలిన మట్టిదిబ్బ...
ప్రమాద దృశ్యాలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది... ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం... బ్యారికేడ్లన్నింటినీ తోసేసుకుని మట్టిదిబ్బ అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది. ఈ ధాటికి ఒక ట్యాంకర్ లారీ కొట్టుకుపోయింది. అదే సమయంలో ఇంకో ప్రైవేట్ బస్సు నదిలో పడిపోయింది. పాదచారులైతే ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోతూ కనిపించారు. కొందరు మట్టిలో కూరుకుపోగా... మరికొందరు ఇరుగుపొరుగు సాయంతో బయటపడ్డారు. స్నిఫర్ డాగ్ల సాయంతో మట్టిలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కశ్మీర్లో మెరుపు వరదలు
జమ్మూ: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం ఉదయం కొండ ప్రాంతాల నుంచి ప్రవేశించిన వరదతో థాత్రి పట్టణంలో పలు దుకాణాలు, ఇళ్లు, వాహనాలకు నష్టం వాటిల్లింది. భారీగా దొర్లి పడ్డ రాళ్లు, కొట్టుకువచ్చిన మట్టి, వేళ్లతో సహా పెకిలించుకువచ్చిన చెట్లు పట్టణంలో ఎక్కడ చూసినా మేట వేశాయి. థాత్రి పట్టణంలో దోడా–కి‹Ù్తవార్ రహదారి మూసుకుపోయింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాలు పెద్ద సంఖ్యలో మట్టి, బురదలో కూరుకుపోయాయి. మట్టిదోడా, కిష్త్వార్ జిల్లాల్లో రెండు రోజుల వ్యవధిలో ఇలా మూడు చోట్ల మెరుపు వరదలు సంభవించాయి.
ప్రాణం దక్కించిన పరుగు
వయనాడ్లో జరిగిన ప్రమాదం నుంచి దంపతులిద్దరు భలే తప్పించుకున్నారు. మట్టిదిబ్బ కూలే క్రమంలో కట్టలు తెంచుకుని అడ్డంకులను దాటుకుని బురద శరవేగంగా దూసుకొస్తూంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలువురు పరుగురు పెట్టడం వీడియోలో కనిపించింది. అందరి ప్రాణాలు ఆ మట్టిలోనే కలిసిపోతాయని అందరూ అనుకున్నారు.
బురద మనుషులతోపాటు ట్యాంకర్ వంటి భారీ వాహనాలను కూడా తనతో ఈడ్చుకెళ్లింది. ట్యాంకర్ కాస్తా బ్రిడ్జికి ఆవల నిలిపిన జీప్ను గుద్దుకోవడమూ కనిపించింది. ఆ దంపతులు కూడా కొట్టుకుపోయారని అందరూ అనుకున్నారు కానీ సెకన్ల తరువాత ఇద్దరూ లారీకి, జీపుకు మధ్య నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ‘‘నిర్మాణం జరిగే చోట బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. అకస్మాత్తుగా మట్టి మావైపు దూసుకొస్తూ కనిపించింది. వంతెనకు అడ్డంగా పరుగెత్తాం. వెనుక నుంచి చుట్టేసిన మట్టి మమ్మల్ని దూరంగా తోసేసింది. ఇద్దరం పడిపోయాం. లారీతోపాటు కొట్టుకుపోతున్నాం.
లారీ కింద పడిపోతానేమో అనిపించింది. కానీ దాని పక్కన నుంచి వెళ్లిపోయాం. ప్రాణాలతో ఎలా బయటపడ్డామో ఇప్పటికీ తెలియడం లేదు’’అని బాధిత మహిళ తన భయంకర అనుభవాన్ని వివరించింది. మట్టి కనిపించగానే పరుగు లంకించుకున్నామని, బురదలో కొట్టుకుపోతున్న తమకు లారీ కనిపించలేదని ప్రమాదం నుంచి బయటపడ్డ భర్త తెలిపారు.


