Telangana Express Catches Fire: తెలంగాణ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
Published
Sat, Aug 19 2023 12:24 PM
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఎక్స్ప్రెస్కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. మహారాష్ట్ర నాగ్పూర్ వద్ద రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆగష్టు 18వ తేదీ ఢిల్లీ నుంచి రైలు బయల్దేరింది. 19వ తేదీ ఉదయం ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే నాగ్పూర్లో ఆపేశారు. దీంతో ప్రయాణికులు బోగి దిగి బయటకు పరిగెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.
ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి కారణాలు దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని అంటున్నారు.
ఉద్యావన్ ఎక్స్ప్రెస్లోనూ..
బెంగళూరులోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్ఆర్ స్టేషన్లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు ప్రకటించారు.