రెప్పపాటులో ఒక కుర్రాడి జీవితం ఆగిపోయింది. ఇంకా ఎన్నో కలలు కంటూ, భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన 17 ఏళ్ల విద్యార్థి.. ఓ చిన్న నిర్లక్ష్య దారుణరీతిలో బలైపోయాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన కుర్రాడిని ఆ ఘోర స్థితిలో చూసి తోటి ప్రయాణికులు వణికిపోయారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగల్చడమేకాదు.. వెన్నులో వణుకు పుట్టించింది. హుబ్బళి నుంచి లక్ష్మేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఫక్కీరేష్ అనే 17 ఏళ్ల విద్యార్థి, వెనుక సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్నాడు. కుందగోళ్ (Kundgol) స్టేజ్ దగ్గర్లో ఉండగా.. ఫక్కీరేష్ ఒక్కసారిగా కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. క్షణంలోనే వెనుక నుంచి వస్తున్న టిప్పర్ అతడిని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో అతని తల తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయగా, బస్సులో విషాద వాతావరణం నెలకొంది. మృతుడు అతను ఐటీఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థిగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

కదులుతున్న వాహనాల్లో కిటికీల వద్ద జాగ్రత్తలు పాటించకపోతే చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


