కృత్రిమ మేధను కేవలం సహాయకారిగానే వాడుకోవాలి.
జడ్జీల విచక్షణాధికారాలకు అది ప్రత్యామ్నాయం కాదు
కేసుల విచారణ, తీర్పులు, బెయిల్, కీలక నిర్ణయాల్లో ఏఐ వాడొద్దు
ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన సుప్రీంకోర్టు
జూన్ 20 వరకు అభ్యంతరాలు తెలియజేయాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాన్ని ప్రోత్సహిస్తూనే.. దాని పరిమితులను స్పష్టంగా నిర్దేశించింది. ఏఐని కేవలం సహాయకారిగా మాత్రమే వాడుకోవాలని, న్యాయమూర్తుల విచక్షణాధికారాలకు అది ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాబోదని తేల్చిచెప్పింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ఏఐ కమిటీ రూపొందించిన ‘న్యాయస్థానాల్లో ఏఐ వినియోగం– 2026’ముసాయిదా నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యం(పబ్లిక్ డొమైన్)లో అందుబాటులో ఉంచింది. దీనిపై జూన్ 20వ తేదీలోగా సలహాలు, సూచనలు అందించాలని.. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరింది. ఆధునికరణకు ప్రాధాన్యం ఇస్తూనే న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడాలన్నదే తమ ఉద్దేశమని పరోక్షంగా పేర్కొంది. కేవలం అల్గారిథమిక్ నిర్ణయ విధానం ద్వారా ఎటువంటి న్యాయపరమైన ఫలితాన్ని సాధించరాదని వెల్లడించింది.
డేటా భద్రతకు ప్రాధాన్యం
కోర్టుల్లో చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించి, న్యాయ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్న వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ముసాయిదాకు రూపకల్పన చేసింది. న్యాయ సమాచార అన్వేషణ(లీగల్ రీసెర్చ్), కోర్టు పత్రాల తయారీ, తీర్పుల అనువాదం, కోర్టు ప్రొసీడింగ్స్ ట్రాన్స్క్రిప్షన్ వంటి పరిపాలనాపరమైన పనులను ఏఐ ద్వారా సులభతరం చేయవచ్చని అంగీకరించింది. అయితే, ప్రైవేట్ కృత్రిమ మేధ వ్యవస్థల వల్ల వ్యక్తిగత సమాచార గోప్యత, డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టుల డేటాపై పూర్తి నియంత్రణ, యాజమాన్య హక్కులు న్యాయస్థానాల పరిధిలోనే ఉండేలా నిబంధనలను కఠినతరం చేసింది.
ఏఐ ఒక సహాయకారి మాత్రమే..
ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో ఎంతగా అభివృద్ధి చెందినా.. న్యాయ ప్రక్రియలో అవి కేవలం సహాయకారి పాత్రకే పరిమితం కావాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏఐ సాంకేతికత ఒక్కోసారి వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ఇచ్చే ప్రమాదం ఉన్నందున, దాని ఫలితాలను గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించింది. ఏఐ సాయంతో ఏవైనా పిటిషన్లు, పత్రాలు తయారుచేస్తే.. ఆ విషయాన్ని కోర్టుకు తప్పనిసరిగా ముందే వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ ఏఐ తప్పుడు సమాచారం ఇస్తే.. దానిపై నెపం నెట్టి న్యాయవాదులు లేదా కక్షిదారులు తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు వీల్లేదని ముసాయిదా పేర్కొంది. కోర్టుకు ఆ పత్రాలను ఎవరు సమరి్పస్తే వారిదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థలో మానవ ప్రమేయానికే ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని ఉద్ఘాటించింది.
నిబంధనల అమలు ఇలా..
కృత్రిమ మేధ వినియోగంపై సుప్రీంకోర్టు విడుదల చేసిన ఈ ముసాయిదా నిబంధనలు అ త్యున్నత న్యాయస్థానంతో పాటు హైకోర్టులు, దేశవ్యాప్తంగా ఉన్న కింది కోర్టులు, ట్రిబ్యునళ్లకు సైతం వర్తిస్తాయి. దీని ప్రకారం.. లీగల్ రీసెర్చ్, పాత తీర్పుల సారాంశాన్ని అర్థం చేసుకోవడం, డాక్యుమెంట్ల అనువాదం, నోటీసులు, సమన్ల తయారీకి మాత్రమే న్యాయవాదులు ఏఐని వాడుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ, కేసులను విచారించడం, తుది తీర్పులు వెలువరించడం, శిక్షలు ఖరారు చేయడం, బెయిల్ మంజూరు చేయా లా? వద్దా? అనేది తేల్చడం, సాక్షుల విశ్వసనీయతను అంచనా వేయడం వంటి అత్యంత కీలకమైన నిర్ణయాత్మక అంశాల్లో ఏఐ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే న్యాయస్థానాల్లో ఏఐ వ్యవస్థల పర్యవేక్షణ, ఆడిటింగ్ కోసం సుప్రీంకోర్టు స్థాయిలో ప్రత్యేక అపెక్స్ బాడీని, అన్ని హైకోర్టుల్లో ప్రత్యేక ఏఐ కమిటీలను ఏర్పాటు చేయాలని ముసాయిదా సూచించింది. ఇదిలా ఉండగా, ఈ ముసాయిదాను పలువురు న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు.


