భారత్ అంటేనే ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. భారత్లో సీజన్ను బట్టి ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఇలాంటి ప్రదేశాలను కవర్ చేస్తూ ఇప్పుడు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పర్వతాలు, తీవ్ర ప్రాంతాలు, నదులు, వాటర్ ఫాల్స్ను దాటుకుంటూ వెళ్తుండటం ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో వందే భారత్ రైలు మార్గాలు ప్రయాణీకులను ముఖ్యంగా ఆకర్షిస్తున్నాయి.
వందే భారత్ రైళ్లు కేవలం వేగం, సౌకర్యం మాత్రమే కాదు.. భారతదేశ భౌగోళిక వైవిధ్యాన్ని కిటికీ నుంచి ప్రత్యక్షంగా చూపించే అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. హిమాలయ శిఖరాలు, పశ్చిమ కనుమలు, కేరళ తీరప్రాంతం, కాశ్మీర్ లోయ ఇవన్నీ ఒకే రైలు ప్రయాణంలో చూడగలిగే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రయాణించిన వారు.. తప్పకుండా ఆయా మార్గాల్లో ప్రయాణించాలని సోషల్ మీడియా సజెస్ట్ చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి నాటికి 164 వందే భారత్ సేవలు 82 మార్గాల్లో నడుస్తూ, దేశవ్యాప్తంగా 274 జిల్లాలను కలుపుతున్నాయి. వీటిలో పలు మార్గాలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంతకీ ఆయా మార్గాలు ఎక్కడ.. ఎలా వెళ్తున్నాయో.. తెలుసుకుందాం..
1. కత్రా-శ్రీనగర్ మార్గం..
మార్గం: శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా - శ్రీనగర్
దూరం: సుమారు 270 కి.మీ
సమయం: సుమారు 3-4 గంటలు
ప్రత్యేకత: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన (359 మీటర్లు), హిమాలయ పర్వతాలు, కాశ్మీర్ లోయ.
ప్రయాణం: 58 సొరంగాలు, 11 కిలోమీటర్ల పొడవైన పిర్ పంజాల్ సొరంగం, మంచుతో కప్పబడిన శిఖరాలు. మార్చి-అక్టోబర్ మధ్య కాలంలో ఈ మార్గంలో ప్రయాణించడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమాలయ పర్వతాలను దగ్గరగా వీక్షించవచ్చు. కత్రా నుంచి శ్రీనగర్ వెళ్తూ కుడి వైపు కిటికీ సీటు తీసుకుంటే వంతెన దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది.

2.త్రివేండ్రం-ఎర్నాకులం
దూరం: సుమారు 220 కి.మీ
సమయం: 3–4 గంటలు
ప్రత్యేకత: కొబ్బరి తోటలు, బ్యాక్వాటర్స్, తీరప్రాంత దృశ్యాలు, ఆలయ పట్టణాలు
ప్రయాణం: అరేబియా సముద్రం తీరప్రాంతం వెంట రైలు ప్రయాణం. ఎర్రటి కప్పులతో ఉన్న సంప్రదాయ గ్రామాలు, కొబ్బరి చెట్లతో నిండిన కాల్వలు. కొల్లం, అలప్పుజా వంటి సాంస్కృతిక పట్టణాల గుండా ప్రయాణం నడుస్తుంది. డిసెంబర్-మార్చి వెళ్తే బాగుంటుంది. వర్షాకాలం (జూన్–సెప్టెంబర్)లో మరింత పచ్చదనం ఉంటుంది కానీ భారీ వర్షాలు ఉంటాయి. ఈ మార్గంలో పగలు ప్రయాణం చేస్తే కేరళ పచ్చదనం, తీరప్రాంత దృశ్యాలు పూర్తిగా ఆస్వాదించవచ్చు.

3. ముంబై-కోల్హాపూర్ మార్గం..
దూరం: సుమారు 500 కి.మీ
సమయం: 8 గంటలు 30 నిమిషాలు
ప్రత్యేకత: పశ్చిమ కనుమలు, మబ్బులతో నిండిన లోయలు, హిల్ స్టేషన్లు ఉంటాయి.
ప్రయాణం: ముంబై నగరాన్ని వదిలి పశ్చిమ కనుమల్లోకి ప్రవేశం. సతారా, బెలగావి, ధారవాడ గుండా ప్రయాణం నడుస్తుంది. వర్షాకాలంలో జలపాతాలు, పచ్చని లోయలు కనిపిస్తాయి. శీతాకాలంలో మబ్బులతో నిండిన లోయలు, స్ట్రాబెర్రీ తోటలు, చారిత్రక కోటలు చూడవచ్చు.
జూన్ – సెప్టెంబర్ (వర్షాకాలం)లో అద్భుతమైన జలపాతాలు కనువిందు చేస్తాయి.

4. ఢిల్లీ ఆనంద్ విహార్-డెహ్రాడూన్ మార్గం..
దూరం: దాదాపు 302 కి.మీ
సమయం: 4 గంటల 45 నిమిషాలు
ప్రత్యేకత: ఉత్తర భారత మైదానాల నుంచి శివాలిక్ పర్వతాల వరకు భౌగోళిక మార్పు.
ప్రయాణం: గంగానది, అడవులు, దూన్ లోయ, మంచు పర్వతాలు. ఈ మార్గంలో మార్చి-జూన్, సెప్టెంబర్-నవంబర్ మధ్య ప్రయాణించడం కను విందు చేస్తుంది.

4. ముంబై-మడ్గావ్ (గోవా) కొంకణ్ రైల్వే మ్యాజిక్ మార్గం..
దూరం: సుమారు 580 కి.మీ
సమయం: 7 గంటల 45 నిమిషాలు (వర్షాకాలంలో కొంచెం ఎక్కువ)
ప్రత్యేకత: పశ్చిమ కనుమలు, కొంకణ్ రైల్వే, 84 వంతెనలు, తీరప్రాంత దృశ్యాలు.
ప్రయాణం: వర్షాకాలంలో జలపాతాలు, ఆకాశం, పచ్చని లోయలు కనిపిస్తాయి. జూన్-సెప్టెంబర్ (వర్షాకాలం) లేదా అక్టోబర్-ఫిబ్రవరి మధ్య ప్రయాణం బాగుంటుంది. ముంబై నుంచి గోవా వెళ్తూ ఎడమ వైపు కిటికీ సీటు తీసుకుంటే సముద్రం, జలపాతాలు బాగా కనిపిస్తాయి.

6. అహ్మదాబాద్-ముంబై మార్గం..
దూరం: సుమారు 491 కి.మీ
సమయం: 5 గంటలు 40 నిమిషాలు
ప్రత్యేకత: ఆరావళి పర్వతాలు, తీరప్రాంతాలు, మహానగర దృశ్యాలు.
ప్రయాణం: ఎడారి నుంచి తీర ప్రాంతం వరకు విభిన్న భౌగోళిక దృశ్యాలు కనపడతాయి.


