
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని జల్గావ్ నుంచి ముంబై వెళ్లేందుకు ఆయన విమానాశ్రయంలో దాదాపు గంటపాటు వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. షిండే వ్యక్తిగత విమానానికి చెందిన పైలట్ తన డ్యూటీ టైమ్ ముగిసిందని పేర్కొంటూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ముక్తాయ్ నగర్లో జరిగిన ఒక మతపరమైన ఊరేగింపులో పాల్గొన్న తరువాత జల్గావ్ నుంచి ముంబై బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. షిండేతోపాటు ఆయన ఆయన బృందం రాత్రి 9.15 గంటలకు జల్గావ్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే పైలట్ తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెబుతూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు. దీంతో కొందరు అధికారులు పైలట్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. 45 నిముషాల తర్వాత పైలట్ విమానాన్ని నడిపేందుకు ఒప్పుకున్నాడు. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే విమానం ముంబైకి బయలుదేరింది.
ఇది కూడా చదవండి: ఐదు దశల్లో ‘మహా’ మ్యాచ్ ఫిక్సింగ్: రాహుల్ సంచలన వ్యాసం