
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటి ఎన్నికల్లో బీజేపీ పలు అవకతవకలకు పాల్పడిందని, ఎన్నికల్లో విజయం సాధించేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని ఆరోపిస్తూ ఆయన ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ కోసం రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేయడానికి ఐదు దశలను అనుసరించిదని రాహుల్ ఆరోపించారు.
మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లలో 235 సీట్లు గెలుచుకుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. అయితే బీజేపీ సాధించిన ఘన విజయం నేపధ్యంలో పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆ పార్టీపై పలు ఆరోపణలు చేశాయి. 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆపరేషన్ నిర్వహించిందని రాహుల్ ఆరోపించారు. ఇందుకోసం ఆ పార్టీ ఐదు దశలను అనుసరించిందని పేర్కొన్నారు. అవి..
1: ఎన్నికల కమిషన్ నియామకం కోసం ప్యానెల్ను రిగ్ చేయడం.
2: జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చడం.
3: ఓటర్ల సంఖ్యను పెంచడం.
4: బీజేపీ విజయం సాధించాల్సిన చోట బోగస్ ఓటింగ్ను ప్రోత్సహించడం.
5: ఆధారాలను దాచిపెట్టడం.. అని రాహుల్ గాంధీ ఆ వ్యాసంలో రాశారు.
How to steal an election?
Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.
My article shows how this happened, step by step:
Step 1: Rig the panel for appointing the Election Commission
Step 2: Add fake voters to the roll
Step 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025
2024 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని అందుకోగా, కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) శరద్ పవార్ ఎన్సీపీ(ఎస్పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కేవలం 50 సీట్లకు పరిమితమయ్యింది. తాను చిన్న తరహా మోసం గురించి మాట్లాడటం లేదని, జాతీయ స్థాయిలో జరిగిన భారీ రిగ్గింగ్ గురించి మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

2023లో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో తీసుకువచ్చిన మార్పులను రాహుల్ ఈ వ్యాసంలో ప్రస్తావించారు. దానిలో పేర్కొన్న వివరాల ప్రకారం మహారాష్ట్రలో నమోదైన ఓటర్ల సంఖ్య 2019 అసెంబ్లీ ఎన్నికలలో 8.98 కోట్లు ఉండగా, 2024 లోక్సభ ఎన్నికలకు 9.29 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలో 31 లక్షల పెరుగుదల చోటుచేసుకుంది. అయితే నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ సంఖ్య మరో 41 లక్షలు పెరిగి , 9.70 కోట్లకు చేరుకుందని రాహుల్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను అవమానకరమైనవని బీజేపీ నేత తుహిన్ సిన్హా పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరుగుదలకు తాము చేసిన ప్రచారమే కారణమని పేర్కొంది.అయితే రాహుల్ ఈ వివరణను తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: బీజేపీ తదుపరి అధ్యక్షుడు.. ఆ ముగ్గురిలో ఎవరు?