
ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి, మాజీ సీఎంలకు సంబంధించిన ఫొటోలు ఉండడం సర్వసాధారణమైన విషయమని, దానిని అనవసర రాద్దాంతం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గతంలో తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను, సదరు పిటిషన్నూ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
న్యూఢిల్లీ: ‘స్టాలిన్ విత్ యూ(ఉంగలదాన్’ కార్యక్రమం విషయంలో అన్నాడీఎంకేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆ ప్రకటనల్లో సీఎం ఫొటో, పేరు ఉండడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ బుధవారం స్పష్టం చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును కొట్టేసింది. అలాగే పిటిషనర్ అయిన అన్నాడీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీసీ షణ్ముగంకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ మందలించింది.
మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. సంక్షేమ పథకాల ప్రచారంలో సీఎం ఫొటో వాడడం తప్పేం కాదని స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల్లో ఇది జరుగుతోందని గుర్తు చేసింది. అలాగే గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పథకాలను కొనసాగించిన తీరుపైనా ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో పిటిషనర్ అన్నాడీఎంకే నేత అయిన షణ్ముగంను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
బతికి ఉన్న వ్యక్తులతో పాటు మాజీ సీఎంలు, పార్టీ నేతలు, పొలిటికల్ పార్టీల పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టొద్దని, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా వినియోగించవద్దని గతంలో షణ్ముగం పిటిషన్ ఆధారంగానే మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఆ పిటిషన్ను తోసిపుచ్చింది..
‘‘కేవలం ఒక నేతను, ఒక పార్టీనే పిటిషనర్ లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉద్దేశాలు మేం అర్థం చేసుకోగలం. ఒకవేళ రాజకీయ నిధుల దుర్వినియోగంపై గనుక పిటిషనర్ ఆందోళన చెందితే.. ఆ పథకాల విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించొచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. పైగా తన అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన మూడు రోజులకే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పోరాటాల కోసం కోర్టును వాడుకోవద్దు. అందుకే కింది కోర్టులో ఆయన వేసిన పిటిషన్నూ(ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి) మేమే కొట్టిపారేస్తున్నాం’’ అని సీజే బెంచ్ వ్యాఖ్యానించింది.
వారం లోగా తాము విధించిన ఈ సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాలని షణ్ముగాన్ని.. అదే సమయంలో ఆ సొమ్మును పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఈ పిటిషన్కు సంబంధించిన సుప్రీం కోర్టులో డీఎంకే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ పీఎస్ రామన్తో పాటు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, డాక్టర్ ఏఎం సింఘ్వీలు హాజరయ్యారు. అన్నాడీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు.