Railways Clues Team Examined the Burnt Falaknuma Coaches - Sakshi
Sakshi News home page

Falaknuma Train Accident: ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం ఇదే!.. క్లూస్‌ టీం ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి

Jul 8 2023 2:45 PM | Updated on Jul 8 2023 3:27 PM

Railways Clues Team Examined the burnt Falaknuma Coaches - Sakshi

మొదటగా ఎస్‌-4 కోచ్‌ బాత్‌రూం నుంచి పొగలు చెలరేగాయని.. 

సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్‌కు చేరుకున్న క్లూస్‌ టీం.. దగ‍్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు 12 మంది అధికారులతో కూడిన బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే పంపించగా .. ఈ టీం ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. 

ఇదిలా ఉంటే.. ఎస్‌-4 కోచ్‌ బాత్‌రూమ్‌లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అయితే దర్యాప్తు పూర్తి అయ్యాకే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్‌ టీం అంటోంది. 

హౌరా నుంచి సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌.. శుక్రవారం ఉదయం నల్లగొండ దాటి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో.. రెండు బోగీల నుంచి  దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించి కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో.. రైలు నిలిచిపోయింది.  ఇక ప్రయాణికులంతా దిగిపోయి పెను ప్రమాదం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. 

అయితే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్‌ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా, రైలు నిర్వహణ సరిగా లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement