
ఢిల్లీ: దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులను తగిన సమయంలో అందించి, విద్యార్థులను ఆదుకోవాలని రాహుల్ కోరారు.
దేశంలోని దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తప్పుబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యకు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని గాంధీ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల బీహార్లోని దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్ను తాను సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. అలాగే అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు అందించడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు. అక్కడి స్కాలర్షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడంలేదని, 2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ లభించలేదని రాహుల్ పేర్కొన్నారు. ఇటువంటి వైఫల్యాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే , దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని తాను భావిస్తానని ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు