Priyanka Gandhi Says BJP Forgot To Fuel Double Engine In Last Five Years, Details Inside - Sakshi
Sakshi News home page

ఇంజిన్‌లో ఇంధనం మరిచారు!.. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌పై ప్రియాంక సెటైర్లు

Nov 7 2022 7:56 PM | Updated on Nov 7 2022 8:11 PM

Priyanka Gandhi Says BJP Forgot To Fill Fuel in Double Engine - Sakshi

గత ఐదేళ్లుగా డబుల్‌ ఇంజిన్‌ ఉంది కదా.. బహుశా వారు అందులో ఇంధనం నింపడం మరిచిపోయారేమో!

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో  కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా భాజపా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే ఉందని.. కానీ, ఇంజిన్‌లో బహుశా ఇంధనం నింపటం మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం, పాత పింఛను విధానం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేశారు. 

రాష్ట్రంలోని ‘ఉనా’ ప్రాంతంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం వేదికగా.. బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ప్రియాంక గాంధీ.‘ బీజేపీ నేతలు వచ్చి మాకు ఓటు వేయండి.. ఇక్కడ డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ వస్తుందని చెబుతుంటారు. గత ఐదేళ్లుగా వారు ఎక్కడున్నారు. గత ఐదేళ్లుగా డబుల్‌ ఇంజిన్‌ ఉంది కదా.. బహుశా వారు అందులో ఇంధనం నింపడం మరిచిపోయారేమో!’ అని విమర్శలు గుప్పించారు ప్రియాంక.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పాత పింఛను విధానం అమలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు కాదో ఒక్కసారి ఆలోచించాలన్నారు ప్రియాంక. హిమాచల్‌లో ప్రస్తుతం 63వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. తాము లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెబుతుంటే భాజపా సాధ్యం కాదంటోందని.. మరి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా చేయగలిగిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని.. అక్కడ తమ ప్రభుత్వం మూడేళ్లలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. అలాగే, మహిళలకు నెలకు రూ.1500ల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బిగ్‌ ట్విస్ట్‌.. అప్రూవర్‌గా దినేష్‌ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు!

Advertisement
 
Advertisement
Advertisement