రాజకీయ క్రీడాస్థలిగా రైల్వే | PM Narendra Modi flags off Rajasthan first Ajmer-Delhi Vande Bharat Express | Sakshi
Sakshi News home page

రాజకీయ క్రీడాస్థలిగా రైల్వే

Apr 13 2023 6:26 AM | Updated on Apr 13 2023 6:26 AM

PM Narendra Modi flags off Rajasthan first Ajmer-Delhi Vande Bharat Express - Sakshi

జైపూర్‌: కేంద్రంలో గత ప్రభుత్వాలు రైల్వే వ్యవస్థను రాజకీయ క్రీడాప్రాంగణంగా వాడుకుని దుర్వినియోగం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. బుధవారం రాజస్థాన్‌లో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఆయన ప్రారంభించారు. ఇది దేశంలో 15వ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌. అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్‌ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుంది.

  ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘రాజకీయ లాభమనే సంకుచిత దృక్పథంలోనే గత ప్రభుత్వాల ఆలోచనలు సాగాయి. అందుకే రైల్వే ఆధునీకరణ పట్టాలెక్కలేదు. ఎవరు రైల్వే మంత్రి కావాలి, ఏ స్టేషన్‌ గుండా ఏ రైలు వెళ్లాలనే అంశాలూ రాజకీయ లబ్ధి కోణంలోనే  నిర్ణయమయ్యేవి. 2014లో సుస్థిర ప్రభుత్వం వచ్చాక రైల్వేల పరిస్థితే మారిపోయింది. రాజకీయ జోక్యం పోయింది’’ అన్నారు.

గహ్లోత్‌జీ, థ్యాంక్యూ
రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న వేళ కూడా సీఎం అశోక్‌ గహ్లోత్‌æ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలని మోదీ అన్నారు. ‘‘గహ్లోత్‌ నాకు మంచి మిత్రుడు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్‌ రాజస్థానీలే. అలా మీ చేతిలో రెండు లడ్డూలున్నాయి’’ అన్నారు.
నవ్య భారత్‌ కోసమే
భోపాల్‌: ‘అధునాతన, అభివృద్ధి చెందిన భారత్‌’ కోసమే నూతన జాతీయ విద్యావిధానం తెచ్చినట్టు మోదీ చెప్పారు. భోపాల్‌లో నూతన ఉపాధ్యాయుల నియామక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. ‘‘విజ్ఞానం, నైపుణ్యం, సంస్కృతి, భారతీయ విలువలను చిన్నారి విద్యార్థుల్లో ఇనుమడింపజేయడంలో ఎన్‌ఈపీ ఎంతో దోహదపడనుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement