ఈఏసీ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ
చేపట్టాల్సిన చర్యలపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆర్థిక సలహా మండలి(ఈఏసీ) సభ్యులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పశ్చిమాసియా సంఘర్షణ భారతదేశం, ప్రపంచంపై చూపే ప్రభావం పట్ల తమ అంచనాను ఈఏసీ సభ్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘ఈరోజు ఆర్థిక సలహా మండలి సమావేశానికి అధ్యక్షత వహించా.
దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించాం. సంస్కరణల ప్రయాణానికి మరింత ఊపునివ్వడంతోపాటు సులభతర జీవనం, సులభతర వాణిజ్యంపై మా అభిప్రాయాలు పంచుకున్నాం’’అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ ఆర్థికాభిృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా వివిధ ఆలోచనలు, చర్యలపై ఈఏసీ భేటీలో చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి.
సులభతర జీవనం, సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగుపర్చడమే ధ్యేయంగా పలు సంస్కరణలపైనా చర్చించినట్లు వెల్లడించాయి. ఈఏసీ అనేది కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఆర్థిక, సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. ప్రస్తుతం ఈఏసీలో ఛైర్మన్, ముగ్గురు పూర్తికాల సభ్యులు, 11 మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు. ఎస్.మహేంద్ర దేవ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి సూచించిన ఆర్థిక లేదా ఇతర ఏ అంశాన్నైనా విశ్లేషించి, దానిపై ఆయనకు సలహా ఇవ్వడం, ఆర్థిక ప్రాముఖ్యత గల సమస్యలను పరిష్కరించి, వాటిపై ప్రధానమంత్రికి అభిప్రాయాలను సమర్పించడం ఈఏసీ బాధ్యత.


