జ్ఞానవాపి: 30 ఏళ్ల తర్వాత పూజలు | Permission to Worship in Gyanvapi Reactions | Sakshi
Sakshi News home page

Gyanvapi: జ్ఞానవాపిలో 30 ఏళ్ల తర్వాత మొదలైన పూజలు

Feb 1 2024 10:29 AM | Updated on Feb 1 2024 5:24 PM

Permission to Worship in Gyanvapi Reactions - Sakshi

యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో సుమారు 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు జరగడం గమనార్హం. వ్యాస్‌ కా తెహఖానా(వ్యాసుని నేలమాళిగ) సెల్లార్‌లో ఉదయం 3గం.కే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. 

వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్‌ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది. కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ మసీదులో వేకువ ఝామున 3 గంటలకే పూజలు ప్రారంభం అయ్యాయి. విశ్వనాథుడి ఆలయ పూజారి మంగళహారుతులు ఇచ్చారు.  రాష్ట్రీయ హిందూ దళ్‌ సభ్యులు మసీద్‌ సమీపంలో మందిర్‌(ఆలయం) అనే బోర్డును అంటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. 

బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ఇక్కడి ప్రాంతాన్ని సీజ్‌ చేయించారు. హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఒక్కరికీ ఇక్కడ పూజలు చేసే హక్కు ఉంది అని హిందు పక్షం తరఫున కోర్టులో వాదనలు వినిపించిన విష్ణు శంకర్‌ జైన్‌ చెబుతున్నారు. 

 ఇక ఈ తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.  ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోర్టు ఈ ఉత్తర్వును స్వాగతించారు. దీనిపై ‘ఎక్స్‌’లో స్పందిస్తూ 'శివ భక్తులకు న్యాయం జరిగింది.  విశ్వనాథుని ఆలయ సముదాయంలోగల వ్యాసుని నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కును మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని’ అన్నారు.

జ్ఞానవాపి మసీదులోని ‘వ్యాస్ కా తహఖానా’లో పూజలు చేయడానికి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే  హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏ పక్షానికి ఎలాంటి సమస్య ఉండదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement