సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద టీఎంసీ నేత సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సీఆర్పీఎఫ్ ఈమేరకు సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని తాను సుప్రీంకోర్టు ముందుంచుతానని గోఖలే చెప్పారు.
జూలై 20వ తేదీన సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు పెల్లెట్ గన్లను వాడారంటూ వచి్చన ఆరోపణలపై సహచట్టం కింద సీఆర్పీఎఫ్కి పంపిన దరఖాస్తును గోఖలే సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘నిరసనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటూ సీఆర్పీఎఫ్ సమాచారాన్ని నిరాకరించింది. దీనిపై అప్పిలేట్ అథారిటీ కూడా సమాచారాన్ని అందించేందుకు నిరాకరించింది’అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించలేదంటూ మొదట్లో బుకాయించిందని గోఖలే గుర్తు చేశారు.


